Sunday, April 22, 2012

శీలంవారి అబ్బాయి -గండువారి అమ్మాయి!!



పలనాటి పౌరుషాన్ని వెల్లడించే గొప్ప వీరగాథ,  తెలుగునాట ఇంచుమించు మహాభారతానికి   ఉన్నంత  ఆదరణ పొందిన    గాథ -            
పల్నాటివీరగాథ.
 బ్రహ్మనాయుడు, నాగమ్మల మంత్రతంత్రాంగంతో పలనాటిసీమలో నెత్తుటేరులు పారాయి.  మహా భారతంలో అభిమన్యుడిని తలపించే పాత్ర పలనాటి వీరగాథలో బాలచంద్రుడు.
లేతవయసులోనే యుద్ధసీమలో కొదమసింగంలా ముందుకురికి శత్రువులను నాశనం చేసి తన సోదరికి  ఆత్మశాంతి కలిగించిన బాలచంద్రుడు లేనిదే పల్నాటి యుద్ధమే లేదు. అతని భార్య మాంచాల. ఆంధ్రుల ఆడపడుచుగా నేటికీ పౌరుషానికి అభిమానానికి పెట్టింది పేరుగా  చెప్పుకునే గొప్పపేరు మగువ మాంచాల పాత్ర. 


చారిత్రక వ్యక్తులైన ఈ ఆలుమగలు  "పల్నాటి యుద్ధం" చిత్రంలో ఓ సన్నివేశంలో ఏవిధంగా సంభాషించుకున్నారో, ఆ చమత్కారం ఏమిటో ఆ సాహిత్యపు సొబగులేమిటో ఈ గీతంలో విందాం.







గండుకన్నమ వంశస్థురాలు,  రేఖాంబ కుమార్తె మాంచాల.
 శీలమ్మ, దొడ్డనాయుడు ల కుమారుడు బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడు, ఐతాంబల ఏకైక కుమారుడు బాలచంద్రుడు. బాలచంద్రుడికి  మాంచాలకి వివాహం జరిగింది. వివాహం జరిగి  చాలా కాలం అయ్యాక  బాలచంద్రుడు భార్య మాంచాలను కలుసుకొనేందుకు అత్తగారింటికి వచ్చాడు. అదీ ఈ పాట సందర్భం.

"శీలముగలవారి చినవాడా
 చిగురంత దయలేని మొనగాడా
నిను నమ్మి కన్నె నిచ్చుకున్న వారి ఇంటికి దారి 
ఈ నాటికి తెలిసినదా...
చినవాడా మొనగాడా"

పెళ్ళిజరిగి ఇంతకాలమయినా బాలచంద్రుడు తనను చూడడానికి రాలేదని మాంచాల మనసు తల్లడిల్లుతోంది. అతని జ్ఞాపకాలతో కాలం గడుపుతూ ఉన్నది ఇంతకాలం. కానీ అతనేమో తనని మరిచాడు. నన్ను మరిచిపోయావా అని సూటిగా భర్తను అడగకుండా "నిను నమ్మి కన్యాదానం చేసిన వారి ఇంటి దారి మరిచిపోయావా" అని బాలచంద్రుడు తనను నిర్లక్ష్యం చేయడం వలన ఎంత బాధ పడుతోందో  వెల్లడించింది.
శీలము గలవారి చినవాడా అంటూ భర్తని సంబోధించడంలో అతని వంశాన్ని ప్రశంశిస్తూ, చిగురంత దయలేని మొనగాడా అంటూ బాలచంద్రుడు ఎంత మొనగాడయినా తనమీద మాత్రం చిగురంత దయకూడా చూపలేదంటూ తన వేదనని ఆ సంబోధనలో ఇమిడ్చి ఇలా అంటుంది.

లేత జవ్వని, తన ధర్మపత్ని మాంచాల ఆవేదనను గ్రహించాడు బాలచంద్రుడు. ఆమె మనసులో తనపట్ల ఆరాధనను తెలుసుకున్నాడు. అంతే కాదు, ఆ మాంచాల, రూపంలో ఎంత స్నిగ్థంగా, నాజూకుగా కనిపించినా ఆమె మనసులోని విషయాన్ని అంతకన్నా నాజూకుగానే  అయినా మనసులో నాటకునే మాటలతో తెలియజేయగల నెరజాణ కూడా అని గ్రహించాడు. 

మాంచాల గండు వారి వంశానికి చెందిన ఆడపడుచు.  రేఖాంబ ఏకైక సంతానం, ముద్దులపట్టి. అందుకే ఇలా సంబోధించాడు.
"గండువారి గారాబాల గద్దఱి
 చినదానా- గారాల చినదానా" అంటూ.
గండు అనే పదం ఇక్కడ గమనించాలి. మాంచాల వంశం పేరు చెప్పినట్టుగా ఈ పదం వాడినా కవి ఉద్దేశం మాంచాల పౌరుషం గల అభిమానవంతురాలని, గారాబంగా పెరిగడం వలన కొంచెం పెంకితనం, ఎదుటివారిని గద్దించగల నేర్పు,(గద్దఱి అంటే దిట్టతనం ఉన్నగలది అని)  ఉన్న పడుచు అని బాలచంద్రుడు గ్రహించాడన్నమాట. అందుకే ఇక్కడ ఇంటిపేరు చెప్పినట్టుగా చెప్తూనే   గండు అనే పదం వాడారు కవి.




"కొమ్మన పలికే కోయిలవనుకుంటి 
కొదమ సింగానివే వయ్యారి - అరుదైన సింగారివే వయ్యారి"

వసంతంలో కోయిల పాటలను వినని వారుండరు. కానీ అది ఎక్కడ ఏ చెట్టుకొమ్మమీద కూర్చుని కుహూ రాగాలను పలికిస్తోందో చూసేదెందరు. ఆకులందు అణగిమణిగి కూసే కోయిలలాంటి అమ్మాయి, అని అనుకున్నాడుట మాంచాల గురించి బాలచంద్రుడు. కానీ తనను ఇంతకాలం మరిచిపోయి, ఇప్పుడు తనను వెతుక్కుంటూ వచ్చావా అని గద్దరించి అడుగుతోంది కాబట్టి ఆమె కోయిలకాదని,  సమయం చూసుకొని మాటువేసి దాడిచేసే కొదమసింగం లాంటి ధైర్యంగల అమ్మాయి అని గ్రహించాను అంటాడు. మాంచాల లో సౌందర్యం, సాహసం కూడా చూసాడు బాలచంద్రుడు. అందుకే అరుదైన సింగారివే వయ్యారి అంటూ స్త్రీలలో అరుదుగా సాహసమూ, సౌందర్యమూ కలబోసిన మూర్తిమంతంగా మాంచాలను చూసాడు బాలచంద్రుడు.






"సిరులేడుగలవారి చినదానా, చివురంటి మనసున్న చినదానా"


 అంటూ తన చెలి మాంచాలను సంబోధిస్తాడు బాలచంద్రుడు. సిరిసంపదలు గలిగిన శ్రీమంతురాలు మాంచాల. ఎన్నో సిరులు కలిగి ఉన్నా, తనపై విరహమనే సుడిగాలిలోచిక్కి,   చిగురాకులా తనప్రేమకోసం అల్లాడుతోందని చివురులాంటి ఆమె లేతమనసుని గ్రహించాడు కనుకే ఆ సంబోధన.


మాంచాల బాలచంద్రుడు తనను సిరిగలదానిగా సంబోధించడం విన్నది. భర్త ప్రేమానురక్తులకోసం పరితపించే భార్య  మాంచాల. బాలచంద్రుడు వివాహం జరిగినా ఇంతకాలం తనకోసం రాలేదు.


ఇక్కడ  పల్నాటి వీరగాథలో ఓ విషయం చెప్పుకోవాలి.  శ్యామాంగి  అనే వేశ్య వ్యామోహంలో పడిన బాలచంద్రుడు భార్య మాంచాలను నిర్ల క్ష్యం చేసాడు. మూడునిద్రలకోసం అత్తగారింటికి వచ్చిన మాంచాల భర్తను చూడకుండానే పుట్టింటికి తిరిగి వెళ్ళిపోయిందట. ఆ బాధ ఆమె మనసులో ఎంత కార్చిర్చులా దహించి వేస్తోందో  ఈ మాటలలో గ్రహిస్తాం.


మాంచాలను కొదమ సింగంతో పోల్చాడు బాలచంద్రుడు. దానికి సమాధానంగా మాంచాల ఇలా అంటుంది.


" కొదమ సింగానికి కోనలో ఒంటరితనమే దీవనా"
 అంటూ. తనకి కొదమసింహంలాంటి సాహసం, తనలో అపురూపమైన శరీరలావణ్యం ఎన్ని ఉన్నా అవి తోడులేక వ్యర్థంగా పడి ఉన్నాయని భావిస్తుంది.


 బాలచంద్రుడు అంటే చంద్రుడు కదా. అతని వెన్నెల కాంతులలో ప్రపంచమంతా పులకరిస్తుంది.  ఇక్కడ నెలరాయడు అంటే చంద్రుడు అనే అర్థంతో పాటు బాలచంద్రుడు అనే అర్థం కూడా వాడారు కవి. బాలచంద్రుడి భార్య అయినా ,   ఆ చల్లని వెన్నెల సోనలు మాంచాలను మాత్రం  తాకడం లేదు.  బాలచంద్రుడి దయ అనే వెన్నెల కాంతి తనకు సోకని కారణంవలన మనసులో వేదన జ్వాలగా దహిస్తోంది.  అందుకే ,


"నెలరాయని ఐదువరాలికి  వెన్నెల సోకని వేదనా"


 అంటూ  ప్రశ్నిస్తుంది." సిరులున్న ఫలమేమి చినవాడా" అంటూ తన సిరిసంపదలన్నీ భర్త ప్రేమకు నోచుకోనినాడు వ్యర్థమే అని ఖచ్చితంగా చెప్తుంది.


మాంచాల మనసును గ్రహించాడు బాలచంద్రుడు. ఆమె తన అనురాగంకోసం ఎంతగా తపిస్తోందో తెలుసుకున్నాడు. ఇంతసేపు  ఆమె ఔద్ధత్యాన్ని, శారీరక లావణ్యాన్ని మాత్రమే గమనించిన బాలచంద్రుడి సంబోధన మారింది.


 "చినదానా, గారాల చినదానా"  అంటూ  తన ప్రేయసిని గారంగా, నయాగారంతో సంబోధించాడు.


"వెనుకటి వెతలు కలలో కథలే,
 మనమేకమై మనమేకమయినాములే" 


  తనకోసం మాంచాల మనసులో పడిన  కలతలు, బాధలు అన్నీ వెనుకటి వెతలే నని ఊరడించాడు. గడిచిపోయిన కాలంలోని బాధలిక ముందు కలగవని హామీ ఇచ్చాడు. అవన్నీ కలలో కథలే అవుతాయని ఆమెకు నచ్చచెప్పాడు.  మనమేకమై, మనమేకమయినాములే అని ముందుజీవితంలో తామందుకోబోయే సుఖజీవనానికి పాదు చేసాడు.


ఇక్కడ "మనమేకమై, మనమేకమయినాము" లో మనము అంటే మనసులు ఏకమై, మనము అంటే తామిద్దరూ ఏకమయ్యాము అంటూ పదచమత్కారం చేసారు కవి.


భర్త బాలచంద్రుడు తన అనురాగాన్ని గుర్తించాడని తెలిసాక మాంచాలకి ఎంతో సంతోషం కలిగింది. 


"పున్నమిలాగా నీవురాగా  మన్ననగా  ఈ కన్నెతనమే 
 హారతినిచ్చేను చినవాడా, ఆదమరిచేను చినవాడా "- 
చీకటినిండిన తన జీవితంలో పున్నమిచంద్రుడిలా వచ్చి కాంతినింపినందుకు కృతజ్ఞతగా తన మనసును శరీరాన్ని కూడా అతని ప్రేమకు గౌరవంగా, హారతి ఇచ్చి అతనిలో కరిగిపోదామనుకుంటుంది.  అతని ప్రేమలో ఇన్నాళ్ళూ తాను అనుభవించిన బాధలన్నీ మరిచిపోయి సేదదీరాలనుకుంటుంది. ఆదమరిచి అతని చేతులలో ఒదిగిపోతుంది.


చక్కని చందమామ వెలుగులో సాగిన  ఈ గీతం, మాంచాల పాత్రలో జమున, బాలచంద్రుడి పాత్రలో హరనాథ్ ల పైన   చిత్రించబడింది.


గొప్ప చారిత్రాత్మక పాత్రలు మాంచాల, బాలచంద్రులు. ఆ దంపతుల  మధ్య   ఎంతో ఎడబాటు తర్వాత కలిసినప్పుడు   ఆ సందర్భం ఎలా ఉంటుందో , అతి చక్కగా ఊహించడం, వారి  మనసులోని భావాలను సంభాషణాత్మకంగా వ్యక్తం చేయడం కవి గొప్పదనమైతే-


అత్యంత సాహసం, లేత చంద్రునిలోని నాజూకైన సౌందర్యం కూడా నింపుకున్న బాలచంద్రుడి పాత్రలో హరనాధ్,  అత్యంత మనోహరమైన రూపురేఖా విలాసాలతో బాహ్య సౌందర్యమే కాక, నిబ్బరమయిన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగల మనోధైర్యంగల స్త్రీగా,  భర్త ఆదరణకోసం, ప్రేమానురాగాల కోసం తపించే అర్థాంగిగా మాంచాల పాత్రలో జమున ఈ గీతానికి నిజంగా ప్రాణం పోసారు.


ఈ సాహిత్యానికి రసాలూరు సాలూరు వారు శ్రీ రాజేశ్వరరావు సమకూర్చిన బాణీ కూడా చాలా విశిష్టంగా వినిపిస్తుంది. చాలా అరుదుగా వినబడే సంగీతసాహిత్యాలు కలబోసిన ఈ గీతాన్ని సుశీల తోపాటు ఆలపించినవారు,
మంగళంపల్లి బాల మురళీ కృష్ణగారు కావడం ఈ గీతానికి మరో  ప్రత్యేకతను సంతరించింది. ఆయన గొంతులో వినిపించే ఆ మాధుర్యం, లాలిత్యం బాలచంద్రుడి పాత్రకు జీవం పోసింది.


ఈచక్కని యుగళగీతాన్ని ఇక్కడ వినడంతో పాటు చూసి ఆనందించండి.




చిత్రం           పల్నాటి యుద్ధం


గీతరచన      సముద్రాల రాఘవాచార్య లేదా వెంపటి సదాశివబ్రహ్మం
                (సముద్రాలగారి జీవిత విశేషాల పుస్తకం జీవితమే 
                సఫలము) లో ఇచ్చిన లిస్టులో ఈ పాటను ఆయన 
                రచించినట్టుగాలేదు.

                 వెంపటి సదాశివబ్రహ్మం ఈ సిని్మాకి డైలాగులు రాసారని 
                 వికిపిడియా చెప్తోంది)


సంగీతరచన    సాలూరు రాజేశ్వరరావు


చిత్రదర్శకుడు   గుత్తారామినీడు


చిత్రనిర్మాణం -1966, అన్నపూర్ణా పిక్చర్స్.




























4 comments:

జీవన పయనం - అనికేత్ said...

New & Nice to hear.

Anonymous said...

Nice and explanatory article on lyric.Good analytical tribute to saluri-a synonym for great music

Unknown said...

బహు అరుదుగా లభించే సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. కానీ, చివరగా పాటని రచించినవారి పేరు సందిగ్ధములో పడిపోయింది..

GRK said...

ఇది అన్నపూర్ణ పిక్చర్స్ కాదండి.. శ్రీ అనురూప ఫిల్మ్స..నిర్మించిన చిత్రం