Monday, June 13, 2011

హాయ్..హాయ్...ఎంత హాయి....

హాయి హాయంటూ హాయైన పాటలు రాసిన పింగళివారి మరో ఆణిముత్యం

ఎంత హాయి ఈరేయి, ఎంత మధురమీహాయి. (గుండమ్మ కధ 1962)

గుండమ్మ కథ ప్రధానపాత్ర గుండమ్మ ఆమె సవతి కూతురు సావిత్రి అయితే స్వంత కూతురు జమున. స్వాతిశయం బహు మెండు. తల్లికి ముద్దుల కూతురు. తను చెప్పిన మాటని  చెల్లించేలా చూసుకోగల దు.తల్లి చూసిన సంబంధమే అయినా తనకి కూడా బాగా నచ్చాడు కనుక పెళ్ళి చేసుకుంది . ఆపెళ్ళి జరిగాక తొలిరాత్రి భర్త సమక్షంలో తన భావి జీవితాన్ని కలలు కంటూ దానికి ప్రాతిపదిక అయిన ఆ మొదటిరేయినాటి హాయిని అనుభవిస్తూ   తనకు కలిగిన ఆ హాయిని మాటలలో పేర్చుతూ పాటగా ఆలపించిన గీతం ఇది.

ఎంతహాయి......ఎంత హాయి ఈ రేయి..ఎంత మధురమీ హాయి ఎంత హాయి...

చందమామ వెలుగులో కలుగుతున్న హాయిని అనుభవిస్తున్న భర్తను చూస్తూ, ఆ హాయిని తానూ అనుభవిస్తూ గొంతు కలుపుతుంది భర్తతో పాటు. ఎంత హాయి ఈరేయి ఎంతమధురమీ హాయి అంటూ.



ఈ పాట సాహిత్య పరంగా చూస్తే ఎంతో విలువలున్నపాట. పాటలోని మాటలన్నీ తేటతెలుగు మాటలు. మాటలతో మనసుమీద పింగళివారు చేసిన గారడీ ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలుగుమీద ఆయనకి ఉన్న పట్టు ను చూపించే చక్కని పట్టులు ఎన్నో ఉన్నాయిక్కడ.

 ప్రతి రెండు వాక్యాలు ఒకేలాంటి మాటలతో ప్రారంభమవుతూ ఉన్నా  పదాలలో చేసిన చిన్న మార్పుల వలన 

అవి వేర్వేరు అర్థాలు బోధించేలా ఉండడం ఈ పాటలోని వాక్యాల ప్రత్యేకత.

 

చందమామ చల్లగా మత్తుమందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా


వాక్యంలో చందమామ అతనిపై మత్తుమందు చల్లినట్టుగా పరవశం కలిగి మత్తు ఆవహిస్తోంది అంటున్నాడు.
కానీ ఆమె చందమామ చల్లుతున్నది మత్తు కాదు, చల్లగా పన్నీటి జల్లును చల్లుతున్నాడు అంటుంది.


నీటిని జల్లేది ఎప్పుడు అనేది అందరికీ తెలిసిన అనుభవం. మంచి నిద్రలో ఉన్నవారిని మేలు కొలపాలంటే ఉన్న సాధనం నీటిజల్లే కదా. నీటిని జల్లితే ఎంత మత్తు నిద్ర అయినా వదిలి తెలివి వస్తుంది. ఆమె చందమామ ఇస్తున్న ఈ హాయి మత్తులా నిద్రతెచ్చేది కాక పన్నీటి జల్లు చల్లుతూ నిద్రాణంగా ఉన్న కోరికలను రేపే విధంగా ఉందనీ, అదీ మామూలు నీరుకాదు, పరిమళ భరితమయిన పన్నీటి జల్లు జల్లుతున్నట్టుగా  ఉందని భావిస్తోంది.


చల్లగా అనే పదం అన్ని సార్లు వాడినా ఆ పదానికి చెపుతున్న అర్థాలు వేరువేరుగా గ్రహించాలి.
భాషలో నానార్థాలు ఇచ్చే పదాలపై కవికి గల అవగాహనతో పాటు పాటలో తూగు కలిగే విధంగా అర్థంలో వైవిధ్యం చూపించే నేర్పు కనిపిస్తుంది ఇక్కడ. అతను చల్లగా చల్లగా అన్నప్పుడు మొదటిసారి చల్లగా అంటే చల్లదనాన్ని, రెండవసారి చల్లగా అంటే చల్లటం అనే క్రియని తీసుకోవాలి. అలాగే ఆమె చల్లగా చల్లగా అన్నప్పుడు మొదటిసారి చల్లగా  అన్నప్పుడు  పన్నీరుజల్లు చల్లదనాన్ని, రెండవసారి చల్లగా అంటే చల్లటం అనే క్రియను తీసుకోవాలి.


విరితూపుల పరవడిలో విరహమతిశయించగా
విరితావుల ఘుమ ఘుమలో మేను పరవశించగా
ఎంత హాయి......ఈ రేయి...


ఒకరి చూపులొకరి పైన విరతూపులు విసరగా అనే వాక్యం చూడండి.
చూపులు అనే పదానికి తూగే పదం రైమింగ్ వర్డ్ తూపులు. ఒకరి చూపులు ఒకరిపైన విరితూపులు విసరగా అంటే ఇక్కడ చూపులు విరితూపుల్లా ఉన్నాయి. తూపులు అంటే బాణాలు. అవి మామూలు బాణాలు కాదు విరితూపులు. అంటే పువ్వుల బాణాలు. పువ్వుల బాణాలు ఎవరు వేస్తారు అంటే మన్మధుడు అని మన కవిసమయం కదా. అలా మన్మధుడు విరితూపులతో బాణాలు వేస్తున్నాడు అని అతను అంటాడు.
 అలా విసరబడిన మన్మథ బాణాలు గబ గబా మనసును నాటితే అతనిలో విరహం అతిశయిస్తోంది. విరితూపుల పరవడి లో అనే మాటలో 'పరవడి' అనడంవలన ఆ మన్మధబాణాల వేగపు  తాకిడిని అతను అనుభవించడం  కనిపిస్తుంది.అందుకే అతనిలో విరహ భావం ఎక్కవకావడం..అతిశయించడం.


ఆమెకి మాత్రం పరస్పరం ఒకరినొకరు చూసుకుంటున్న ఈ చూపులు విరితావులు వీచినట్టు గా అంటే పూలవాసనలతో మత్తుగా వీచుతున్న గాలి ఒంటిని సోకితే ఎలా ఉంటుందో అలా ఉందట.
 ఆ  పరిమళాల ఆస్వాదనతో మనసు నిండిపోయి సర్వేంద్రియాలతోనూ ఆ హాయి ని అనుభవిస్తోంది. విరితావుల ఘుమఘమలో మేను పరవశిస్తోందని అంటుంది.


కానరాని కోయిలలు మనల మేలు కొలుపలగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావ లహరిలో మనము తూలిపోవగా
మధుర భావ లాహరిలో మనము తేలిపోవగా
ఎంత హాయి...ఈరేయి.
మనసులో సంతోషపు వసంతాలు వెల్లి విరుస్తున్నాయి ఇద్దరికీ. అందుకే ఆ వసంతకాలపు గుర్తు, ప్రతినిధి  అయిన కోయిల కలరవాలు వినబడుతున్నాయి. అది నిజానికి రాత్రి సమయం. కోయిల కూసే సమయం కాదు.
కానీ ఈ మధురమైన రేయి కలిగిస్తున్న హాయివలన వసంతరాగం ఆలపిస్తున్న కోయిల కుహూరవాలు వినగలుగుతున్నారు. కోయిల కూతవింటే కలిగే హాయిని అనుభవిస్తున్నారు. అందులోనూ ఒక కోకిల కాదు, చాలా కోకిలలు కూస్తే వచ్చే శబ్దం ఇంకా మధురంగా ఉంటుందేమో.


అందుకే కానరాని కోయిలలు మనకు మేలుకొలుపగా పాడగా అంటూ అతను ఆ కనిపించని కోయిలలు చేస్తున్న వినిపించని  ఆలాపనని ఊహిస్తూ ఆ కోయిలలు తమకు మేలుకొలుపుతున్నట్టు ఊహిస్తాడు.
ఆమెకి కూడా ఈ కానరాని కోయిలల రాగం వినిపించింది కానీ ఆమె అనుభవం వేరు. ఈ కోయిలల పాట ఆమెకి మత్తుకలిగిస్తూ కలల ప్రపంచంలో పరవశంగా నిదురించేలా ఆ నిదురకోసం కోయిలలు పాడుతున్న జోలపాటలా అనిపిస్తోంది. ఇక కాలం వృథా చేయడం ఎందుకనే చిలిపి పిలుపు కూడా ఇక్కడ ఉందేమో- అందుకే జోల పాడగా అని ప్రయోగించారు. అందుకే ఆ ఆలాపన అతనికి మేలుకొలుపుగా అనిపిస్తే ఆమెకి మత్తుకలిగించే పారవశ్యంతో కూడిన జోలపాటలా వినిపించింది.

ఇక్కడ ఇంకో చక్కని ప్రయోగం.... నిద్రపోవడానికి జోలపాడితే, నిద్రలేవడానికి మేలుకొలుపు పాడతాం. ఈ రెండు వ్యతిరేక పదాలను వాడుతూ, ఇద్దరి ఊహలను ఒకే పదాలతో ప్రారంభించే వాక్యాలుగా రాస్తూనే వేరు వేరు అర్థాలు ఇచ్చేలా గొప్పగా రాసారు పింగళి.


అతను మధురభావ లహరిలో మనము తూలిపోవగా అంటాడు. మధురమైన భావాలు ఒక పెద్ద అలలాగ వచ్చి పడడం వలన దాని తాకిడికి  తామిద్దరమూ  తూలుతామని అతను అంటాడు.
కానీ ఆమె మధుర భావ లాహిరిలో మనము తేలిపోవగా అంటోంది. ఇక్కడ మధురమైన భావాల వలన కలిగిన మైకంలో  ఆమె మనసు తేలిపోతోందని అంటుంది.మత్తులో తేలడం అనే భావం మనకు తెలిసినదే కదా.
లహరి అంటే  పెద్ద అల అనే అర్థాన్ని, లాహిరి అంటే మైకం, మత్తు అనే అర్థాలను అతి స్వల్పభేదం ఉన్న పదాలను అర్థవంతంగా, ఎంతో నైపుణ్యంగా వాడారు పింగళి.


ఇక్కడ ఇంకో చమత్కారం కూడా ఉంది. మొదటి వాక్యంలోని  మనము అని అతను అన్నప్పుడు ఆమె, అతను కలిసి మనము అనే అర్థంలో వాడారు. ఆమె అన్నప్పుడు మనము అంటే ఆమె మనసు అనే అర్థంలో వాడారు.


ఈ పాటలో కేవలం పింగళివారి భాషా చమత్కారాన్నే కాక పాత్రల మానసికమైన చిత్తవృత్తులను ఆకళింపు చేసుకొని పాటలు రాసిన కవిగా  చక్కని ఔచిత్యాన్ని కూడా పోషించారు.


ఈ పాట ఇద్దరు భార్యా భర్తలు తమ తలపులు కలబోసుకొని, మనసులను, తనువులను ఒకరికొకరు సంపూర్తిగా అర్పించుకనే తొలిరేయినాటి సందర్భంగా రాయబడిన పాట.


భార్య జమున పాత్ర అందచందాలతో పాటు తల్లి గారాల పట్టిగా పెరగడం వలన ఒకింత అహంకారం,ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగిఉన్నస్త్రీగా కనిపిస్తుంది. ఆమెను తనకు అనుకూలంగా మార్చుకోవడానికే, ఆమెలో ఉన్న పొగరుకు ముకుతాడువేసి లొంగదీసి తనను ప్రేమించేలా చేసుకోవడాన్నే పనిగా పెట్టుకుని వచ్చి ఆమెని పెండ్లాడిన యువకుడు  భర్త, నాగేశ్వరరావు. అతను ఉత్తముడు, సౌజన్యం,సౌశీల్యం ఉన్నవాడు. ఇలాంటి రెండు పాత్రల మధ్య భావి జీవితానికి నాంది పలికే తొలిరేయినాటి వారి మానసిక స్థితిని వర్ణించే గీతం ఇది.


ఒకే సందర్భంలో  ఒకే రకమయిన పరిస్థితిలో  ఒకే అనుభవాన్ని అనుభవిస్తూనే ఇద్దరూ వేరు వేరుగా దాన్ని అర్థం చేసుకుంటున్నారు.  ఈ విషయం ప్రేక్షకులకు అర్థం కావడానికి పింగళివారు అనుసరించిన కొత్త విధానం ఈరకమయిన రచనా చమత్కారం అని భావించాలి. అతను అన్నదానికి ఆమె కాదు అనేరకం అనే విషయం అర్థం కావడానికి ఈ విధానం తోడ్పడింది. అతనితో ఏకీభవించినట్టుగా, ఏకీభవించే ఉద్దేశం ఉన్నా తన స్వతంత్రమయిన ఆలోచనలని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే పాత్ర కాబట్టి. ఈ విధమైన పాత్ర ధోరణిని ప్రదర్శించడానికి పాటలోని సాహిత్యం దోహదపడి కథా గమనానికి పాత్రలను ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి తోడ్పడింది.


ఇలా పాటలో పదాల మార్పుతో వాక్య విన్యాసంతో చేసిన కొత్త ప్రయోగం ఎంతో సందర్భశుద్ధితో, ఔచిత్యంతో కొత్తదనంతో ప్రేక్షక,శ్రోతల హృదయాలను ఉయ్యాలలూపుతోంది. పారవశ్యపు మత్తులో తూగేలా చేస్తోంది. ఆనందపు వెల్లువలో కొట్టుకుపోయేలాచేస్తుంది.

 పాటలో మాటలను చిన్న చిన్నవే కాదు అతిచిన్నమార్పులతోకూడిన పదాల ప్రయోగంతో మొత్తం వాక్య అర్థ స్ఫూర్తినే మార్చేయగల మాటల మాంత్రికుడు పింగళివారు.

పాట పూర్తిగా ఇక్కడ :

ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి (2)
చందమామ చల్లగ మత్తుమందు చల్లగా ఆ
చందమామ చల్లగ పన్నీటిజల్లు చల్లగా                 (ఎంత హాయి)
 

ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావుల వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశించగా      ఎంత హాయి

కానరాని కోయిలలు మనల మేలుకొల్పగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధురభావ లహరిలో మనము తూలిపోవగా

మధురభావ లాహరిలో మనము తేలిపోవగా             ఎంత హాయి


ఈ పాటలో జమన, నాగేశ్వరరావులనే కాక, సావిత్రి,ఎన్.టి. రామారావుల జంట కూడా అదే  సందర్భంలో అదే హాయిని అనుభవస్తున్న జంటగా మనం చూడవచ్చు.  

గుండమ్మ కధ 1962

దర్శకుడు కమలాకర కామేశ్వరరావు

పాటరచన పింగళి

నిర్మాణ సంస్థ విజయావారు.


Sunday, June 5, 2011

రావే ప్రేమలతా -ఓహో కవిరాజా !!

రావే ప్రేమలతా.... ఒహో  కవి రాజా'


 పెళ్ళి సందడి చిత్రంలో యుగళగీతం.


స్వీయ సంగీత దర్శకత్వంలో ఘంటసాలగారు ఈ పాటను స్వరపరచి,  బాలసరస్వతీదేవిగారితో కలిసి
ఆలపించారు


దీనిని  సముద్రాల రామానుజాచార్యులుగారు(సముద్రాల జూనియర్) రచించారు. 

సాధారణంగా యుగళగీతాలు సాకీతో ప్రారంభం కావడం కనిపించదు. ఈ పాట సాకీతో ప్రారంభం అవుతుంది. ఈపాట ప్రత్యేకత ఇది.

చూపుల తీపితో కొసరుచున్‌ దరిజేరి
మనోజ్ఞ గీతికాలాపన సేయు
కూర్మి జవరాలొకవైపు
మరొక్క వైపునన్‌
ఈ పసి కమ్మ తెమ్మరలు
ఈ పూవు దోటల శోభలున్నచో
రేపటి ఆశ నిన్న వెతలేటికి
నేటి సుఖాల తేలుమా

 
ప్రియురాలి సరసన ఉండి ఆమె ప్రేమను ఆస్వాదిస్తున్న ప్రియుడు ఇలా అంటాడు.


మనసును రంజింపచేసే గీతాలను ఆలపిస్తూ తన తీయని చూపులతో ప్రేమగా దగ్గరకు చేరిన ప్రియురాలొకవైపు  ఉండగా  కమ్మగా, నెమ్మదిగావీచే గాలులు, అందమైన పూలతోటలు మరొకవేపు  మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంటే  -  ఇక రేపుమీద ఆశ గాని, నిన్న అనుభవించిన బాధలు గాని తలచుకోవడం దేనికి. ఈనాటి ఈ హాయిని అనుభవిస్తూ ఉల్లాసంగా ఉండకుండా  అనే భావం ఈ సాకీలో కనిపిస్తుంది.
 

'రావే ప్రేమలతా' అంటూ ప్రియురాలిని ప్రియుడు సంబోధిస్తే ప్రేయసి ఓహో కవిరాజా అని పలుకుతుంది.


'పూలలో తీగెలలో ఆ తోటలో ఎక్కడ చూసినా  వనరాణిలా నీవే కనిపిస్తున్నావని' అతనంటే, 


'అందమైన అమ్మాయిని చూస్తే కవులందరూ ఇలా భావించడం సహజమే' అంటుంది ఆమె.


పరుగులు పెట్టే సెలయేరులా ఆమెని గబగబా చేరుకోవాలనే తపనని అతను వ్యక్తపరిస్తే ఊహలతో తన మనసుని ఉలికిపడేలా చేయొద్దని ఆమె అంటుంది.


ఇద్దరికీ ఒకరిమీద మరొకరికి కలిగిన మధురమైన భావన అది ప్రణయమేనని నిశ్చయమయింది .


 కాని తాము   ఇద్దరూ ఒకటైతే ఆ కలయికను లోకం ఏమంటుందోనని ఆలోచిస్తుంది ప్రియురాలు. 
మనసులు కలిసిన తరువాత  ఇక లోకంతో ఏం పని,   అని  ప్రకటించుకొని తామిద్దరూ ఒకటే అని బాస చేసుకుంటారు.


పాట సాహిత్యంలో చక్కని తెలుగు పదాలు అనేకం కనిపిస్తాయి.


తన ప్రేయసి అందాన్ని, సోయగాన్ని  పోల్చడానికి వాడిన పదాలు   కిన్నెర మీటుల కిలకిలలు, పలు వన్నెల మెరుపుల మిలమిలలు. 


పరువులిడే సెలయేరు అనడం లో ప్రియురాలిని చేరుకొనే ప్రియుని తొందర తెలుస్తుంది.


 పూవులు, నునుతీవెలు, ముచ్చట, మచ్చిక, కమ్మ తెమ్మెరలు అంటూ వాడిన మాటలు భావకవితా ధోరణిలో శ్రోతలకు ఆహ్లాదం కలిగించే పద ప్రయోగాలు . వారి ప్రేమను వెల్లడించే చక్కని భావ చిత్రాలు.

 కిల కిల, మిల మిల, పూల తీవెలు  తావులు, అందము -  చందము -  ఇలాంటి పదాలను ప్రయోగించడం వలన వాక్యాల లో  కవితాపరమైన తూగు కనిపిస్తుంది. 


అందమైన యువతికి వాడిన పదం ' అందవతి'  - మనకు సినిమా కవిత్వంలో కొత్తగా వినిపించే  ప్రయోగంగా అనిపిస్తుంది.


 ప్రియుడిని నెలరాజుగా వలరాజుగా భావించడం పాత ప్రయోగమే అయినా ప్రేయసిని ప్రేమలతగా భావించడం కొత్త భావన.


భావకవితా యుగపు ధోరణి లో వచ్చిన చక్కని భావ గీతం ఇది.



పల్లవి :

రావే ప్రేమలతా నీవే నా కవితా
కిన్నెర మీటుల కిలకిలవే
పలు వన్నెల మెరుపుల మిలమిలవే


ఓహో కవిరాజా నేడే నెలరాజా
ఎందులకోయీ పరవశము
నీకెందులకో ఈ కలవరము



చరణం : 1
పూవులలో నును తీవెలలో
ఏ తావున నీవే వనరాణి
॥పూవులలో॥


అందవతి కనుపించినచో
కవులంద రి చందమిదేలే
ఓహో కవిరాజా నేడే నెలరాజా


పరువులిడే సెలయేరువలె
నిను చేరగ కోరును నా మనసు
 
ఊహలతో ఉలికించకుమా
నవమోహన ఈ చెలి మదినే
రావే ప్రేమలతా నీవే నా కవితా


ముచ్చటగా మనముండినచో
మన మచ్చికకు   జగ మేమనునో
లోకముతో మనకేమిపని
మనసేకమయి మనముంటే


నేనే నీ కవితా...


రావే ప్రేమలతా... ఓహో... హో...
చిత్రం : పెళ్లిసందడి (1959) 

రచన  సముద్రాల
గానం  ఘంటసాల, రావు బాల సరస్వతి 
సంగీతం  ఘంటసాల