Tuesday, May 24, 2011

కరుణ రసాత్మకమైన వియోగ గీతం

మల్లీశ్వరి - 1951.
ఘంటసాలగారు భానుమతిగారితో కలిసి ఆలపించిన మధురమైన గీతాలలో ఇది మరువలేనిది.
అరవైసంవత్సరాల క్రితం ఆ పాట జనహృదయాలను ఎలాంటి భావోద్వేగాలకు గురిచేసిందో నేడు కూడా అంతగానే మనసులను ఆకట్టుకుంటుంది. చక్కని సాహిత్యానికి మధురమైన సంగీతం తోడైతే  పాటకు ఒనగూరే వైభవం అది.

అద్భుత దృశ్యకావ్యం మల్లీశ్వరి చిత్రం. 


నాయికానాయకులు  బావామరదళ్ళు,  ప్రేమికులు కూడా. అనుకోకుండా విడిపోయారు. తిరిగి కలుసుకునే ఘడియ  ఉందో లేదో తెలియదు. ప్రత్యక్షంగా  తన ప్రేమను తెలుపుకునే అవకాశమూ లేదు.  తెలుగు సినిమాపాటను మేరుశిఖరాగ్ర స్ధాయికి చేర్చిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కలంనుంచి ఇలాంటి సందర్భంలో పుట్టిన పాట.

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు ........


ఈ గీతానికిమహాకవి కాళిదాసు మేఘసందేశం కావ్యం లో మేఘం దూతగా ఉండే అంశమే స్ఫూర్తి అన్న విషయం అందరికీ తెలిసినదే.
యక్షుడు దూరతీరాలలో ఉన్న ప్రేయసికి తన క్షేమాన్ని, ఆమెపైగల తన ప్రేమను తెలియజేయడానికి సందేశం తెలుపడానికి  ఆకాశంలో తారాడే మేఘాన్ని అడగడం మేఘసందేశం కావ్యవస్తువు.అయితే ఈ కావ్యం మేఘం ప్రయాణించే దారిలో కనిపించే వింతలూ, విశేషాలు వర్ణిస్తూ సాగిపోతుంది.


ఈ గేయంలో కృష్ణశాస్త్రిగారు మేఘాన్ని దూతగా ప్రయోగిస్తూనే నాయికా నాయకుల ఇరువురి విరహ భావాన్నీ, విషాద భరితమైన భావోద్వేగాన్ని అత్యంత కరుణరసాత్మకంగా రచించారు.
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవు

బావ క్షేమంకోసం ఆరాటపడుతూ, ఆ వివరాలు తెలుసుకొని రమ్మని మేఘాన్ని అడుగుతుంది మరదలు మల్లి. ఆకాశవీధిలో హాయిగా ఎగురుతూ, దేశ దేశాలు తిరుగుతూ, స్వేచ్ఛగా విహరించే మేఘమే తనకు కావలసిన వివరాలు చెప్పగలిగేదని భావిస్తుంది. 


ఏడతానున్నాడొ బావా
జాడతెలిసిన పోయి రావా  - అందాల ఓ మేఘ మాల


అంటూ మేఘమాల అందాన్ని కొంచెం పొగుడుతూ  తన బావ జాడని తెలుసుకొని ఆ కబురు చెప్పమంటూ బతిమాలుతుంది.


గగన సీమల తేలు ఓ మేఘమాలా
మా వూరు గుడి పైన మసలి వస్తున్నావా..
మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా
రాగాల ఓ మేఘ మాలా....
ఇక్కడ మల్లి తన బావకోసం ఆరాటపడుతూ ఉంటే,  ఉపాధి కోసం దేశాంతరాలు వచ్చిన తన గురించి మల్లి తల్లడిల్లుతోందని ఆ బావ మనసుకి తెలుస్తుంది. మల్లి ఎలా ఉందో అడగాలంటే అతనికి కూడా ఆ ఆకాశంలో విహరించే మేఘమే సరైనదని అనిపిస్తుంది. 


తను చూస్తున్న ఈ మేఘం తన మల్లి ఉండే ఊరి గుడిపైన తిరిగి వస్తోంది అని భావించి,  తప్పక మల్లి దగ్గరనుండి ఏదో సందేశాన్ని మోసుకొని వచ్చే ఉంటుందని భావిస్తాడు. ఆ మాటేదో చెప్పి బాధతో రగులుతున్నమనసుకు  చల్లగా ఓ మాటచెప్పమని మేఘాన్ని వేడుకుంటాడు.


మమత తెలిసిన మేఘమాల
నా మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కనులు దిగులుతో రేపవలు
ఎదురుతెన్నులు చూచెనే
బావకై  చెదరి కాయలు కాచెనే ....
ఓ రాగాల ఓ మేఘమాల.

మల్లి కి బావధ్యానంలో కళ్ళుమూతలు పడడం లేదు. బావకోసం రేయిపగలు  ఎదురుచూపులో కళ్ళు కాయలు కాసిపోయాయి. ఈ విషయం బావతో చెప్పు అంటుంది. 


మనసు తెలిసిన మేఘమాల
మరువ లేనని చెప్పలేవా
మల్లితో....మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచిన  గాని కళ్ళు  మూసిన గాని 
మల్లి రూపే నిలిచెనే.....నా చెంత మల్లి మాటే  పిలిచెనే


ఇక్కడ బావ కూడా మల్లిని మరిచిపోలేకపోతున్నానని, కళ్ళు తెరిచినా మూసినా మల్లే కనిపిస్తోందని, పక్కనే మల్లి నిలిచి పిలుస్తున్నట్టుగా ఉందని తన ఆవేదనను  ఆ మేఘానికి చెప్పుకుంటాడు. 
ఆకాశంలో పయనించే నీలి మేఘం కారు మేఘంగా మారిపోయింది. ఇక ఘడియో క్షణమో అన్నట్టుగా కురవడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రకృతి సహజంగా జరిగేదే. కానీ మేఘం నీలిరంగులోంచి కారుమేఘంగా మారి కురవడానికి సిద్ధంగా మారడాన్ని మల్లి గుండెలోని దుఃఖానికి ఆపాదించడం కవి ప్రత్యేకత. మేఘం తనపట్ల జాలి చూపించాలని మల్లి కోరిక. అందుకే ఆ  అందాల మేఘమాల ఇప్పుడు జాలిగుండె కూడా కలదిగా కనిపిస్తోంది మల్లికి.


జాలిగుండెల మేఘమాలా
బావలేనిది బ్రతుక జాల
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసి పోవా
కన్నీరు .....ఆనవాలుగ బావ మ్రోల


మల్లికి  గుండె బరువుగా అయింది. తనగుండె బరువు తీరాలంటే బావదగ్గర తన దుఃఖాన్ని కన్నీరుగా కరిగించుకోవాలి. అందుకు తనకు అవకాశంలేదు కనుక తిరిగి మేఘాన్నే ఆ పని చేయమని అడుగుతుంది. జాలిగుండెల మేఘమాల అని తన పై జాలిచూపించి, తన కన్నుల కురిసే నీటిని గుండెల్లో దాచుకుని ఆ నీరంతటినీ మోసుకుపోయి బావ సన్నిధిలో కురిపించమని ఆ మేఘాన్ని అభ్యర్థిస్తుంది.మల్లి తనకై ఎంతగా బాధ పడుతోందో తెలుసుకోవడానికి బావకి ఆ మేఘం కురిపించే వాన ఆనవాలు కాగలదని భావిస్తుంది.

కరుణరసానికి పరాకాష్ఠ ఈపాట.
వియోగ శృంగారం ఎంత కరుణరస ప్లావితంగా ఉంటుందో అద్భుతంగా వర్ణించబడిన గీతం ఇది.


ఈ పాట పూర్తి సాహిత్యం ఇది.

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు

దేశ దేశాలన్ని తిరిగి చూసేవు

ఏడ తానున్నాడో బావ

జాడ తెలిసిన పోయిరావా!

గగనసీమల సాగు  ఓ మేఘమాల

మా ఊరు గుడి పైని మసలి వస్తున్నావా!

మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా

నీలాల ఓ మేఘమాల! రాగాల ఓ మేఘమాల!



మమత తెలిసిన మేఘమాల!

నా మనసు బావకు చెప్పి రావా!

ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు

ఎదురుతెన్నులు చూచెనే బావకై

చెదిరి కాయలు కాచెనే  అందాల ఓ మేఘమాల


మనసు తెలిసిన మేఘమాల!

మరువలేనని చెప్పలేవా!

మల్లితో మరువలేనని చెప్పలేవా!

కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని

మల్లి రూపే నిలిచెనే

నా చెంత మల్లి మాటే పిలిచెనే!


జాలి గుండెల మేఘమాల!

నా బావ లేనిది బ్రతుకజాల!

కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని

వానజల్లుగ కురిసిపోవా కన్నీరు

ఆనవాలుగా బావమ్రోల.

చిత్రం: మల్లీశ్వరి(1951)
గీత రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గాయనీగాయకులు: ఘంటసాల వేంకటేశ్వరరావు, శ్రీమతి పి.భానుమతి
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు


స్వరరాజు ఎస్.రాజేశ్వరరావుగారు పాడి వినిపించిన అరుదైన గీతం ఇక్కడ వినండి. ఈ చిత్రం గురించి, ఆకాశవీధిలో పాట గురించి ఆయన మాటల్లో వినండి.
























4 comments:

Anonymous said...

విరహం ఘాటుగా ప్రేమించుకున్నవారికే అర్ధమౌతుంది.
లోతైన భావాన్ని...సరళమైన భాషలో రాసారు.
సరళమైన భాష....సున్నితమైన భావన...సరసమైన సంభాషణ
మనసు తాకుతాయి...

Anonymous said...

బాణీని...దృశ్య రూపంలో పాటని
అందించినందుకు థాంక్స్...

మాలా కుమార్ said...

చాలా బాగుందండి . బాగా వివరించారు . యుగళ గీతాల కోసము ఒక బ్లాగ్ పెట్టటము కూడా బాగుంది .

swathi said...

హాయ్ సుధా
చాలా చాలా బాగా రాశావు. మళ్ళీ,మళ్ళీ చదవాలనిపిస్తోంది.
హృదయపూర్వక అభినందనలు.