Tuesday, May 31, 2011

పలుకరాదటే చిలుకా !! సముఖములోరాయబారమెందులకే....




పలుకరాదటే.....చిలుకా !! సముఖములో రాయబారమెందులకే.....

మన జానపద గేయాలలో తలుపు పాటలు, తడిక పాటలు, చిలుకపాటలు వంటి విభాగాలతో  కొన్ని పాటలు కనిపిస్తాయి. నాయికా నాయకులు ఒకరి మీద ఒకరు అలిగినప్పుడు, మాట్లాడుకోనప్పుడు, అయినా మాటలాడకుండా ఉండలేనప్పుడు తమ మాటలు అవతలి వ్యక్తి వినాలని అనుకున్నప్పుడు ఏదో ఒక వస్తువునో, ప్రాణినో ఆధారం చేసుకుని వారికి చెప్పినట్టుగా తమ భావాలను చెప్పుకోవడం ఈ గేయాలలో కనిపిస్తుంది.
ఈ పాట అటువంటిదే. 



ఒక చిన్న పల్లెటూరులో  రెండు పక్క పక్క ఇళ్ళు. ఒకరిది రైతు కుటుంబం అయితే మరొకరిది గ్రామంలోవారికి అవసరాలకి డబ్బు సద్దుబాటు చేసే షావుకార్లు. ఆ షావుకారుగారికి ఒకడే కొడుకు. పక్కింట్లోని రైతుకి ఒక కొడుకు, కూతురు. 
ఆ రెండు కుటుంబాలు చాలా స్నేహంగా ఉండేవి. ఆడదిక్కులేని షావుకారు కుటుంబానికి సహకరిస్తూ ఉంటుంది పక్కింటి కుటుంబం. ఆ పక్కింటి ఆడపిల్ల షావుకారు ఇంట్లోనే సందడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది. షావుకారు కొడుకు బస్తీ చదువుకోసం వెళ్ళాడు. శలవలు ఇస్తే చాలాకాలానికి దీపావళి పండుగ కోసం  ఇంటికి  వచ్చాడు. 
చిన్నప్పటి నుంచి చూసిన పిల్ల అవడం వలన పక్కింటి అమ్మాయి గుణగణాలు అన్నీతెలిసిన వాడవడం వలన ఆమెని ప్రేమించాడు షావుకారు కొడుకు సత్యం. సత్యం అంటే ఆ అమ్మాయికి కూడా ఇష్టం. అతనికి సదుపాయంగా ఉండడం కోసం పనివారితో ఎన్నో పనులు చేయిస్తూ,అతని మంచి చెడ్డలను గమనిస్తూ ఉంటుంది కానీ ఆతని ఎదుట పడి మాటలాడడానికి ఆమెకి స్త్రీ సహజమయిన సిగ్గు అడ్డం వస్తుంది. పైగా ఆది పల్లెటూరు. నిప్పులేకుండానే పొగని చూసే వారుంటారు. అందువలన ఆమె అతని ఎదురుగా రావడానికి జంకుతూ ఉంటుంది. 

సత్యానికి  మాత్రం ఆమెతో  తన భావిజీవితపు కలలు పంచుకోవాలని,  కలిసి కబుర్లు చెప్పుకోవాలని ఎదురుచూస్తూ ఉంటాడు. ఆమె ఎదురు పడినా తనతో మాటలాడడానికి  సిద్ధంగా లేదు. ఏ విధంగా ఆమెతో తన ఊహలను పంచుకోవాలో అర్థం కాని సత్యం నోట పలికిన మాట.....ఈ పాట.

పలుకరాదటే........చిలుకా !!

  
పక్కింటి అమ్మాయి, చిన్ననాటి తన స్నేహితురాలే అయినా అప్పటి పాపాయి కాదు ఆమె. పెరిగి పెద్దదయింది. సిగ్గువలన తనతో మాట్లాడకుండా దూరంగా ఉంది. అతనికి మాత్రం ఆమెతో తన ప్రేమభావాలను పంచుకోవాలని ఉంది. ఏవిధంగా ఆమెని పలకరించాలో తెలియక ఇలా అక్కడలేని చిలుకని రాయబారిగా ఊహించుకొని మాటలు పాటగా మొదలు పెడతాడు.ఈ సందర్భంలో అతను చిలుకా అని సంబోధిస్తున్నది తను ప్రేమిస్తున్న ఆ అమ్మాయినే.

ఇక్కడ కవి కలం నుంచి జాలువారిన  అతిచక్కని, అందమైన ఓ  వాక్యం ఒకటి కవి ప్రతిభకు నిదర్శనం. తరతరాల పాటు నిలిచి పోయే వజ్రపు తునకలాంటి ఈ పాట-
సముఖంలో రాయబారమెందుకు.

ఒకరి అభిప్రాయం మరొకరికి ప్రత్యక్షంగా  తెలిపే వీలు లేనప్పు డు రాయబారి అవసరం అవుతాడు.  అది ప్రణయానికి సంబంధించిన విషయమయితే మనుషులతో పాటు ఒక్కోసారి  హంసలో, మబ్బులో , పావురాలో, చిలకలో  దూతలుగా ఉండి రాయబారాలు నెరుపుతారు. మన కావ్యాలలో ఇలాంటి సందర్భాలెన్నో.

కానీ ఇక్కడ తను మనసుపడిన చెలి ఎదురుగానే ఉంది. ఏ దూరాలూ లేకపోయినా ఆమె సిగ్గు అనే తెర కట్టుకొని తన వైపు చూడకపోవడం వలన రాయబారం అవసరమవుతోంది.
అది అనవసరం కదా.  సముఖములో రాయబారమెందులకే  అని ఆమెని అతను ప్రశ్నిస్తాడు.
ఎంత అద్భుతమైన సందర్భోచితమైన వాక్యం కదా ఇది.

తాను ఆమెకి చిన్నతనం నుంచి తెలిసిన స్నేహితుడే కాని కొత్తవాడు కాదు కదా. అందుకే ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే అని ప్రశ్నిస్తున్నాడు.

పలికిన నేరమటేఅంటూ తనతో మాట్లాడకుండా ఉండేటంత పెద్ద తప్పు తానేం చేసాడు అని  అడుగుతాడు.

 అంతే కాదు, ఆమె మాట్లాడకుండా ఉండడానికి ఆమె మూగది కాదు కదా..పలుకాడగ నేరవటే అని కూడా చమత్కారంగా ఆమెని కవ్విస్తాడు.

ఇరుగు పొరుగు వారలకి
అరమరికలు తగునటనే.......

తాము ఇరుగు పొరుగు వారమే కాబట్టి అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం మంచిది అని పెద్దలు ఏమీ అనుకోరని ధైర్యం చెప్తున్నాడు. 

ఎన్ని చెప్పినా ఆమె తన సిగ్గుతెరలు తీయడం లేదు. చివరి ప్రయత్నంగా ఇలా అంటాడు.
మనసున తొణికే మమకారాలన్నీ నిండి పోయి  అవి నయగారాలుగా కన్నులలో చిందుతున్నాయని, తను తెలుసుకున్నానని అంటాడు. ఆ సంగతి ఆమెనే తనతో  సూటిగా చెప్పాలని కోరుకుంటాడు. కమ్ముకున్న  సిగ్గుతెరలను తొలగించి తనతో  చెప్పమని అడుగుతాడు.

ఆ మాటలను, అందులో చిందుతున్న అతని ప్రేమను గ్రహిస్తుంది అమ్మాయి.  అతనికి సమాధానం చెప్పాలనుకున్నా స్త్రీ సహజమయిన  బిడియం  ఆమెని ఆపుతోంది.  అందువల్ల ఆమె కూడా చిలుకనే ఆశ్రయించింది.

నిజానికి అక్కడ  చిలుక లేకపోయినా  తన మనసులో మాటని చెప్పడానికి అతను అన్నట్టే చిలుకా అంటూ అతనికి తన సమాధానాన్ని  ఇలా చెప్తుంది.
చిలుకా తెలుపవేలనే, బదులు పలుకవేలనే అంటూ  తను ఎందువలన బదులు పలుకలేకపోతోందో ఆ కారణం చెప్తుంది. 

అతనిమీద తనకు వలపు తలపులున్నా అవి మాటలలో తాను చెప్పలేనని అంటుంది. అటువంటి పనులకు కనుమాటు - చాటు  ఉండాలంటుంది.  పల్లెటూరిలో ఉండే  పడుచు అమ్మాయిలు ఇటువంటి  వగలు పోవడం అమర్యాదగా ఉంటుందని అంటుంది.  అంతే కాక  అలా పరాయి మగవాడితో తమ తళుకు బెళుకులను ప్రదర్శిస్తూ  చనువుగా ప్రవర్తిస్తే పల్లెటూరిలో పక పక నవ్వి తమను ఎగతాళి చేస్తారని, తమ ఇద్దరి కుటుంబాల  పరువు కు భంగం కలుగుతుందని హెచ్చరిస్తుంది.

అంతేకాదు తాను చెప్పకపోయినా అతని మీద ప్రేమఉందని, అది అతను గ్రహించాడు కనుక మాటలతో చెప్పవలసిన పని లేదని, కన్నెపిల్ల భాష ఇలాగే ఉంటుందని దానిని గ్రహించమని కోరుకుంటుంది. ఉలుకులేటికే అని తనమీద కోపగించుకోవద్దని  కోరుతుంది.

ఆమె చిలుకా అంటూ చెప్పిన మాటలన్నీ ఆమె మనసునుండి వచ్చినవే అని గ్రహించాడు అతను. ఆమె మనసులో తనపై ప్రేమ ఉన్నా ఎదురుపడి వెల్లడించలేని కారణాలను కూడా ఆమె పలుకులలో గ్రహించాడు. ప్రేమని మాటలలో వివరించక పోవడానికి కారణమైన సంఘం కట్టుబాటును గ్రహించి ఇలా అంటాడు.

తెలుసుకొంటినే చిలుకా.. పలుకు వింటినే నీ పలుకు వింటినే అని.
ఘంటసాల గొంతులో ప్రేమికుడి మమత నింపుకున్న  అద్భుతమైన లాలిత్యం ఈ పాటలో తొణికిసలాడుతూ  వీనుల విందు చేస్తుంది.  రావు  బాలసరస్వతీ దేవి  మధురమైన స్వరం  తీగ సాగుతూ అందమైన పడుచు పిల్ల  లేత మమతలను కంఠంలో నింపుకొని మనసును గిలిగింతలు పెడుతుంది.

ఆ పాట సాహిత్యం ఇక్కడ :

పలుకరాదటే చిలుకా
పలుక రాదటే
సముఖములో రాయబారమెందులకే
పలుకరాదటే....చిలుకా

ఎరుగని వారమటే
మొగమెరుగని వారమటే
పలికిన నేరమటే
పలుకాడగ నేరవటే
ఇరుగుపొరుగు వారలకు
అరమరికలు తగునటనే                  పలుకరాదటే
                                                      
మనసుని తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుపరాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా                 పలుకరాదటే

ఆమె :

చిలుకా తెలుపవేలనే
బదులు పలుకవేలనే

వలపు తలపులున్నా
కనుమాటు చాటు లేదా
పల్లెపడుచులీవగలు
కనీ వినీ ఎరుగరనీ                    చిలుకా తెలుపవేలనే

తళుకులూ బెళుకులూ
పల్లెటూర చూపిస్తే
పకా పకా నగుదురని 
తెలుప వేలనే                                   చిలుకా  పలుకవేలనే 

మనసులొకటి ఐతే
మరి మాటతో పనేలా
కన్నెబాసలింతేనని
ఎదుట నిలిచి పలుకరని
తెలుపవేలనే చిలుకా పలుకవేలనే.

అతను :
తెలుసుకొంటినే చిలుకా
పలుకు వింటినే నీ పలుకు వింటినే
1950 లో విడుదలైన ఒక మంచి చిత్రం షావుకారు.
ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో నాగిరెడ్డి చక్రపాణి ల నిర్మాణంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో ఎన్.టి.రామారావు, ఎస్.జానకి నాయికా నాయికలు.  జానకి గారు నటించిన ఈ తొలిచిత్రం బాగా పేరుతెచ్చుకుంది. అందువలన  ఆవిడ పేరు ముందు షావుకారు చేరి ఆవిడ అసలు ఇంటిపేరు శంకరమంచి అయినా  నేటి వరకు షావుకారు జానకి గానే తెలుగువారందరికీ తెలిసారు.  వారిద్దరిపైన చిత్రించిన పాట ఇది.

ఈ పాట రచన : సముద్రాల రాఘవాచార్యగారు.
ఈ సినిమాకు సంగీతంసమకూర్చినవారు :ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. 
 పాటని ఇక్కడ వినండి. 




Sunday, May 29, 2011

ఒక్క క్షణం......నన్ను పలుకరించకు!!


" ఒక్కక్షణం....ఒక్కక్షణం... నన్ను పలుకరించకు - నావైపిటు చూడకు" అంటూ ప్రారంభమయే ఈ గీతం దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి రచన.
మరీ అంత పాత పాటలా అనుకునే వాళ్ళకోసం కొంచెం - అంతకన్నా కొత్తపాట.


కలసిన మనసులు(1968) అనే చిత్రం కోసం రచించబడిన గీతం ఇది.




దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు భావకవితా యుగానికి మకుటం లేని మహారాజు. అతిమృదువైన పదాలతో ఎంతో భావగర్భితమైన కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత.  ఈ పాటలో కూడా  ప్రతి పదంలో భావుకత్వంతో   అక్షరాలశిల్పాలు చెక్కారు.


ప్రేమికులు ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నా వారి మధ్య మౌనం మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పే సాహిత్యం ఇది.
ఒకరి సన్నిధిలో మరొకరు ఉన్నా పలకరించుకోవడం, భావాలు పంచుకోవడం ఏవీ మాటల్లో చెప్పకుండానే మనసు తెలుసుకోవడం ఎలా ఉంటుందో ఈ పాటలో చూస్తాం. ఆ మౌనంలో ఉన్న హాయి ఎంతో బరువుగా ఉంటుందని, మోయలేని హాయి అయినా అది భారం కాదని అనిపిస్తుంది. 'మోయలేని ఈ హాయిని మోయనీ' అని అడగడంఎంత గొప్ప ఊహో. అటువంటి ప్రణయ భావనలెన్నో  అత్యంత మధురంగా చిత్రించిన గీతం ఇది.


చాలా యుగళగీతాల్లాగే ఈ పాట కూడా సంభాషణాత్మకంగా ఉంటుంది.


ఒక్క క్షణం అంటూ ప్రారంభమౌతుంది.


ఒక్క క్షణం పాటు నన్ను పలకరించకు అని అడుగుతుంది ప్రేయసి.
దానికి కారణం ఏమిటో అతను అడగకుండానే చెప్తుంది. 'నిన్ను తలుచుకోనీ నా కళ్ళు మూసుకోనీ' అంటుంది. అతని రూపాన్ని ఓసారి మనసుతో తలచుకుని గుండెలో నింపుకుంటే కలిగే హాయి మోయలేనిదైనా అదే ఎంతో హాయిగా ఉంటుంది కనుక ఆ హాయిని అనుభవిస్తూ కళ్ళు మూసుకొని ఉండాలనుకుంటుంది.


ఆమెని చూస్తున్న అతను కూడా ఒక్క క్షణం...అంటూ ఆగుతాడు.


ఏమిటి కారణం ?అంటే ఆమె కనులుమూసుకోనీ అని అడిగింది కదా. ఆ కనులు మూసుకోవద్దంటాడు.
ఆ రెప్పలు వాల్చకు, అటూ ఇటూ కదలకు...... ఒక్క క్షణం అంటాడు.
ఎందుకంటే  ఆ కనులలో  ఆమె పదిలంగా దాచుకున్న ఊహల అర్థం తెలుసుకోవడానికట.
ఆ (కనుల ?) కొలనులలో నీడలను చూడడానకి ప్రయత్నం చేయడానికట.
ఆమె ఊహలలో తనే ఉన్నాడని మరోసారి తెలుసుకోవడానికేమో.  అందుకని ఆ కళ్ళు మూసుకోవద్దని ఒక్కక్షణం ఉండమని అడుగుతాడు.


తనలో తారాడుతున్న జిలిబిలి ఊహలను చెదరగొట్టే ప్రయత్నం ఏవిధంగా జరిగినా ఆమెకి ఇష్టంగా లేదు.
అందుకే తన స్వాధీనంలో లేదని తెలిసినా ప్రకృతిని కూడా అదుపుచేయడానికి ప్రయత్నిస్తుంది.
అంతటా మౌనాన్నే కోరుకుంటోంది కనుక  గాలి, ఏటి అలలు కూడా కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోవాలని  వాటిని ఆదేశిస్తుంది.


'ఆకులతో గాలి ఊసులాడకూడదు...ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు' అంటూ కదిలే గాలిని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. ప్రకృతిసహజంగా గాలి వలన ఆకులు కదలడం, ఏటిలో అలలు చెదరడం సామాన్యమైన భౌతిక సూత్రం. గాలి చలనాన్ని ఆపే ప్రయత్నం ఎవరితరం కాదని తెలిసినా ఆమెతో అలా పలికించిన కవి మాటలలో ఆ సందర్భంలో ఆమె నిశ్శబ్దంగా ఉండే వాతావరణాన్ని ఎంతగా కోరుకుంటోందో తెలుస్తుంది.


ఇక ఇంత మౌనంగా ఉన్న సమయంలో తామిద్దరూ ఎలా ఉండాలనుకుంటుంది అంటే -
'మేను మేను తాకగా మౌనముగా గువ్వలవలె, కొమ్మపైని మాటాడక కునుకు జంట పువ్వుల వలె' ఉండాలిట. ఒకరిపక్కన ఒకరు కూర్చున్నా మాటలతో కాక మేని స్పర్శలో, సాన్నిహిత్యంలోని  మాధుర్యాన్ని అనుభవిస్తూ గువ్వల జంటలాగ, ఒకే కొమ్మకు పూచిన,  అది కూడా నిద్రపోతున్నట్టుగా మౌనంగా ఉండే పువ్వుల జంటలా ఉండాలని కోరుకుంటుంది.


ఒక్కక్షణం నన్ను పలకరించకు, నా వేపు చూడకు అని తన ప్రియుని బతిమాలుతోంది ప్రేయసి.


మరి ప్రేయసి ముఖం చూస్తూ ఆనందిస్తున్న ప్రేమికుడు ఆమె మౌనాన్ని భరించలేకపోయాడు.
వద్దన్నా పలకరిస్తాడు. మాట్లాడించడానికి అర్థం లేని కారణాలు వెతుకుతాడు.
మోముపై ముంగురులు ముసురుతున్నాయి, పెదవి పైన మూగకోరికలేవో మూగుతున్నాయి కదా అని అడుగుతాడు. ఆమె మీద తన అనురాగాన్ని మాటలతో వ్యక్తం చేద్దామని అనుకొని వస్తే  ఆమె మౌనంగా ఉండమంటోంది.


ప్రేయసీ ప్రియులు ముఖాముఖి కలుసుకునే అవకాశాలు అరుదుగా దొరుకుతాయి.  దొరికిన సమయంలో తనివితీరా మాట్లాడుకోకుండా మౌనంగా ఉందామని ఆమె అభ్యర్థించడం అతనికి ఆశా భంగం కలిగించింది కాబోలు. అందుకనే అతనంటాడు 'వాగులాగ ఈసమయం సాగిపోవుననే భయం' అని.


సాగేప్రవాహం లాగే కాలం సాగిపోయి మళ్ళీ ఎప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందో అని సందేహం వ్యక్తం చేస్తాడు.


కానీ ప్రేయసి సన్నిధిని అందులోని మాధుర్యాన్ని తానూ అనుభవిస్తూ 'నాలో నిండిన నీవే నాకు చాలు నేటికి'  అంటూ మనసంతా ఆమె రూపాన్ని  నింపుకుంటూ  ఆమెతో  రాజీపడతాడు. ఆహాయి తనకి కూడా మోయలేనిదే అయినా మోయడానికి, దానిని అనుభవించడానికి సిద్ధపడతాడు.


పాటవిన్న  రసిక హృదయాలకు కూడా పాటలోని అవ్యక్తమైన మాధుర్యం అనుభవమై మోయలేని హాయితో కన్నులు అరమూతలు పడి పాటకు  పరవశమవుతాయి.


ఈ పాట సాహిత్యం :


ఒక్కక్షణం ఒక్కక్షణం
నన్ను పలకరించకు 
నా వైపిటు చూడకు           ఒక్కక్షణం.....ఒక్కక్షణం


నిన్ను తలుచుకోనీ..... నా కళ్ళు మూసుకోనీ
మోయలేని ఈ హాయిని మోయనీ........ఒక్కక్షణం..ఒక్క క్షణం.


ఒక్క క్షణం....ఒక్క క్షణం.
ఆరెప్పలు వాల్చకు అటూ ఇటూ కదలకు
ఒక్క క్షణం ఒక్క క్షణం.


ఆ కన్నులలో ఊహల అర్థమేదొ అడగనీ
ఆకొలనులలో నీడల అదే పనిగ చూడనీ
మోయలేని ఈ హాయిని మోయనీ  .....ఒక్క క్షణం..ఒక్క క్షణం.


ఆకులతో గాలి ఊసులాడకూడదూ
ఏటిలోని అలలు పెదవి విప్పగూడదూ
మేను మేను తాకగా మౌనముగా గువ్వల వలె
కొమ్మ పైని మాటాడక కునుకు జంట పువ్వుల వలె
మోయలేని ఈ హాయిని మోయనీ...   ఒక్క క్షణం....


మోము పైన ముంగురులు ముసరవచ్చునా
మోవి చుట్టు కోరికలు మూగవచ్చునా..


వాగులాగ ఈ సమయం సాగిపోవు ననే భయం
నాలో నిండిన నీవే నాకు చాలు నేటికీ...


మోయలేని ఈ హాయిని మోయనీ..
ఒక్క క్షణం....ఒక్క క్షణం.
ఒక్క క్షణం...ఒక్క క్షణం.


"కలసిన మనసులు" చిత్రం లోనిది ఈపాట. ఈ చిత్ర నిర్మాత కమలాకర కామేశ్వరరావుగారు. నిర్మాణ సంస్థ కౌముది ఫిలిమ్స్. సంగీతం మాష్టర్ వేణు. చిత్రం లో కథానాయకులు శోభన్ బాబు, రామ్మోహన్. నాయికలు వాణిశ్రీ, భారతి. మరి ఈ పాట ఏ జంట పైన చిత్రించబడిందో వివరాలు లభించలేదు.


  ఈ పాట వినాలనుకుంటున్నారు కదూ.
  ఇక్కడ వినండి.


చిత్రం        కలిసిన మనసులు
సంగీతం    మాష్టర్ వేణు
గీత రచన  దేవులపల్లి కృష్ణశాస్త్రి

Thursday, May 26, 2011

ఈ ఘాటు విరహానిదా...ప్రేమదా?


ఎంత ఘాటు ప్రేమయో. 
షష్టి పూర్తి చేసుకున్న పాట ఇది.

ఈ పాటే కాదు, పాటలోని ఈ ప్రారంభ వాక్యం కూడా సూపర్ హిట్.

సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే వాక్యాలు కొన్ని ఉన్నాయి. అవి ప్రజల హృదయాలను గెలుచుకొని వారి భాషలో నిలిచిపోయి సందర్భానుసారంగా ప్రయోగంలో కనిపించడం ఈ వాక్యాల ప్రత్యేకత. క్రమంగా ఆ భాషలోని జాతీయంగా కూడా అవి నిలిచిపోయాయి.

ఉదాహరణకి వాల్మీకి వాడిన 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి' నుంచి, గురజాడ అప్పారావు గారి 'డామిట్ కథ అడ్డం తిరిగింది' వరకు ఇలాంటి ఎన్నో వాక్యాలు  తెలుగు భాషలో గొప్ప జాతీయాలుగా నిలిచిపోయాయి. అటువంటి వాక్యాల సరసన నిలబడగలిగే వాక్యం ఇదికూడా. పింగళివారు తెలుగు భాషకు ఎంతో పదసంపదను చేర్చారు. వారు  ప్రయోగించగా తెలుగు నోళ్ళలో పదే పదే ఉపయోగించబడే ఎన్నో పదాలు తెలుగు జీవితాలలో ఓ భాగంగా మారాయి.,

1951 లో నిర్మించబడిన చిత్రం పాతాళ భైరవి. ఈచిత్రానికి ఒక కాశీమజిలీకథ ఆధారమైనా ఆ కథ జానపదచిత్ర రీతిలో అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులతో, చమత్కారభరితమైన మాటలతో ఆనాడు తెరకెక్కడానికి  చిత్ర దర్శకుడు కె.వి. రెడ్డి తో పాటు కథ, మాటలు, పాటలు అందించిన పింగళి నాగేంద్రరావు కూడా దోహదపడ్డారు.

పింగళిగారు అందించిన ఈ చిత్రగీతాలలో జనహృదయాలను చూరగొన్న ' ఎంతఘాటు ప్రేమయో ' ఇంపైన సంగీతం తోపాటు సొంపైన సాహిత్యాన్నీ కలగలిపిన  యుగళ గీతం.

ఘంటసాల గారు, పి.లీలగారితో కలిసి పాడిన యుగళగీతం...

ఈచిత్రం జానపద కథలలో లాగే ఒక రాజకుమార్తె, మాంత్రికుడు ఆమెని ఎత్తుకుపోవడం, ఒక యువకుడు అతని బారినుండి ఆమెని రక్షించి వివాహం చేసుకోవడం అనే ఇతివృత్తం మీద ఆధారపడినదే.  కోటలో రాజకుమారి, పేదవాడైన తోటరాముడు ఈ చిత్రంలో కథానాయికా నాయకులు.

తోటరాముడిని చూసి తొలిచూపులలోనే అతనిని ప్రేమించింది రాజకుమారి. తోటరాముడు కూడా ఆమెని అలాగే ప్రేమించాడు. కానీ వారి మధ్య సామాజికంగా ఉన్న  భేదాలు, ఆర్థికంగా ఉన్న అంతరువు వారిరువురూ కలుసుకోవడానికి, వారి మనసులు ఒకరికొకరు తెలుపుకోవడానికి ఆటంకాలు. ఆ పరిస్థితిలో ఆ యువజంట తమ ప్రేమను ఒకరి ఎదురుగా ఒకరు నిలిచి చెప్పుకోలేక, తమలో తామే తమ పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ తమ విరహ భావాన్ని ప్రకృతితో పంచుకునే సందర్భం కోసం ఈ పాట రాసారు పింగళివారు.

రాజకుమారి ఏకాంతంగా కూర్చుని ఉంది. చంద్రుని వెన్నెల లోకమంతా వ్యాపించి చల్లదనంతో మైమరపిస్తోంది. కానీ ఆమెకి  మనసంతా తోటరాముడి పైనే ఉంది. తన ప్రేమని ప్రకటించుకోలేని నిస్సహాయత ఆమెలో దిగులు కలిగిస్తుంది.
ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్ర వీక్షణమో
కన్ను కాటు తిన్నదిగా
కళలు విరిసెనే
నా మనసు మురిసెనే
రాజకుమారి మనసులో తోటరాముడిపై తనకు అనురాగం మొలకెత్తడానికి కారణమైన తొలిచూపు గురించి గుర్తుచేసుకుంటూ పాడే పల్లవి ఎంత ఘాటు ప్రేమయో అంటూ ప్రారంభం అవుతుంది. రాజకుమారికి అతనిపైన కలిగిన  ప్రేమని చెప్పడానికి కవి వాడిని 'ఘాటు' అనే పదమే ఇక్కడ అద్భుతంగా తోస్తుంది. అతని చూపు ఆమె మదిలో కలిగించిన కలవరాన్ని వర్ణించే పదం 'ఎంత తీవ్ర వీక్షణమో' అనడం.  ఆ తొలి చూపుతో ఏర్పడిన ప్రేమలోని గాఢతని తెలియజేసే  ఈ రెండు పదాలు ఇక్కడ ఎంతో చక్కగా అతికాయి.

అంతేకాదు, ఆ ప్రేమ ఏర్పడడానికి కారణం తోటరాముడు ఆమెని చూసిన క్షణంలో ఆ చూపులు కలుసుకున్న నిముషంలో ఆమె మనసులో భావాలు చెప్పడానికి వాడిన మరో పదం....'కన్ను కాటు తిన్నదిగా' అనే పదం.

తెలుగు భాషలో ' కాటేయడం' అనే పదం పాములాంటి విషజీవికి వాడతాం. ఇక్కడ అతని చూపులు ఆమెను  కాటేయడం   అనే పదంతో  సూచించారు. పాము కాటేస్తే ఆ విషం ఒళ్ళంతా వ్యాపిస్తుంది, కొన్ని కళలు (లక్షణాలు) కనిపించిన అనంతరం ఆ వ్యక్తికి మరణం సంభవించే అవకాశం కూడా ఉంది.

ఇక్కడ కూడా  కన్నుకాటేయడం వలన వచ్చిన ఫలితంగా ఆమెలో కళలు విరిసాయి. కానీ,  అవి ప్రేమకు సంబంధించినవి. ప్రేమ వలన  కలిగే లక్షణాలు, కంపం, ప్రేమికుడు పదే పదే గుర్తురావడం, నిద్రలేకపోవడం వంటివి ఎన్నో. అతని కన్నుకాటు తినడం వలన ఆమెలో ఈ కళలన్నీ విరిసాయి. అయితే ఆ కళల వలన ప్రమాదం ఏమీ లేదు సరికదా ఆ విధంగా కలిగిన ప్రేమ ఆమె మనసును  మురిపించింది.
ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో
కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే
రాజకుమారి,  తోటరాముడుని తలుచుకుంటూ తనలో విరిసిన తొలిప్రేమను అనుభవిస్తూ ఉంటే అక్కడ తోటరాముడి మనసులో కూడా ప్రణయ భావనలు వెల్లి విరిసాయి. రాజకుమారిలో కూడా తనపై  అనురాగం కలిగిందని ఆ తొలి చూపులోనే తోటరాముడు గ్రహించాడు. ఆమెనే కనుల ముందు ఊహిస్తున్నాడు. ఆమె తొలిసారిగా తననే ప్రేమించిందని గ్రహించడం వలననే ఆమె రూపంలోని లేతదనాన్ని ఆమె ప్రేమకు ఆపాదించుకున్నాడు. ఎంత లేత వలపులో అనుకోవడం దీనినే సూచిస్తోంది.

 తన ప్రేయసి  రాజకుమారి. అందరికీ లభించగలిగే దర్శనం కాదు ఆమెది. పైగా ఆమె కోటలో, రాజరికపు రక్షణలో ఉంది. అందువలన ఆమె తన ప్రేమను ప్రకటించగలిగే స్థితిలో లేదు. అందువలననే తనపై ఆమెకి ప్రేమ ఉందని గ్రహించినా ఆమె వలపులన్నీ చాటు మోహములే...ప్రదర్శించగలిగేవి కావు. ఎంతలేత వలపులో, ఎంత చాటు మోహములో అంటూ చెప్పిన ఈ వాక్యాలు తోటరాముడుకి రాజకుమారి తనని ప్రేమిస్తోందని నిశ్చయించుకున్న స్థితిని చెప్తాయి.
ఇది అతనికి ఎలా తెలిసిందీ అంటే.....కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే అనుకున్నాడు. ఇక ఆమె ప్రేమించిన విషయం తెలిసాక అతని మనసు కుదుట పడింది. అందుకే మనసు నిలిచెనే..నా మనసు నిలిచెనే అన్న వాక్యం.

ఆ తొలిచూపులో రాజకుమారి మనసులో అతనిపై కలిగించిన కలవరం అది ప్రేమేనని ఆ క్షణంలోనే తోటరాముడు గ్రహించడం ఈ కథకి చాలా ముఖ్యమయిన సన్నివేశం. లేకపోతే ప్రణయమూ లేదు, మాంత్రికుడినుంచి ఆమెని రక్షించడమూ లేదు. గాలివాన లేకపోతే కథే లేదు అన్నట్టుగా.

ఇలా అత్యంత సరళమైన వాక్యాలతో తోటరాముడు, రాజకుమారిల మధ్య ఉదయించిన అనురాగాన్ని వివరించారు పింగళి.
ఈ జాబిలి ఈ వెన్నెల 
ఈ మలయానిలమూ
విరహములో వివరాలను
 విప్పిచెప్పెనే
ఇక ప్రేమ కలిగాక  ప్రేయసీ ప్రియులు కలుసుకోలేక పోతే తరువాతి మెట్టు విరహమే కదా. సాహిత్యంలో సంప్రదాయంగా ప్రేయసీ ప్రియుల మధ్య విరహాన్ని ఎక్కువచేసేవి చంద్రుడు, వెన్నెల, చల్లని మందపవనాలు, మధుర పరిమళాలు అని. ఎందుకంటే ఇవి మనసుని చాలా ఆహ్లాదపరచే అంశాలు.

ఇవి అనుభవిస్తున్నప్పుడు మనసుకు నచ్చిన వారితో కలిసి ఉంటే అవి మరీ హాయిగొలుపుతాయని ఒక భావం. అందువలన దూరంగా ఉన్న నాయికా నాయకులు ఈ అనుభవాన్ని ఒక్కరే పొందవలసి వచ్చినప్పుడు వారిలో ఈ ప్రకృతిలో అందరికీ హాయిగొలిపే ఈ విషయాలు వారికి హాయిని కాదు కదా బాధని కలిగిస్తాయి. విరహంలో ఉన్నప్పుడు ఇవి ఇంత బాధ కలిగిస్తాయా అని  రాజకుమారి మనసులో భావిస్తోంది. అందుకే విరహములో వివరాలను చంద్రుడు, వెన్నెలా, చల్లగాలి ద్వారా తెలుసుకున్నానని అనుకుంది. 

ఈజాబిలి,ఈ వెన్నెల ఈ మలయానిలమూ విరహములో వివరాలను విప్పిచెప్పెనే అని రాజకుమారి అనుకోవడంలో మనకి కూడా ఆమెకి తోటరాముడిమీద ప్రేమకలిగి విరహం కూడా అనుభవిస్తోందని చెప్పే వాక్యాలు.

ఓ జాబిలి ఓ వెన్నెల 
ఓ మలయా నిలమా
విరహములో విరహాగ్నిని 
పెంపుజేయరే

తనని ప్రేమిస్తున్న రాజకుమారి కి తన ఎడబాటు వలన విరహబాధ కలిగే ఉంటుందని మనసుతో గ్రహించాడు తోటరాముడు. కానీ ఆమె ఒకసారి అతని గురించి ఆలోచించి ఊరుకుంటే ఆ ప్రణయం పండదు.అతని పై విరహం అతిశయించాలి. అప్పుడే ఇద్దరూ కలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆమెని సాధించడానికి అతను చేసే ప్రయత్నం సఫలమవుతుంది. ఈ విరహం పెంచడానికి అతనికి అందుబాటులో ఉన్నవి ఆ జాబిల్లి, ఆ వెన్నెల,ఆ మలయానిలాలే. అందుకే అతను కూడా  వాటినే అర్థించాడు.

ఇక్కడ ఆమె - ఈ జాబిలి, ఈ వెన్నెల, ఈ మలయానిలము అంటే,  తోటరాముడు - ఓ జాబిలి !! ఓ వెన్నెల!!  ఓ మలయానిలమా!! అంటూ సంబోధనతో వాటిని పిలవడంలో అతని అభ్యర్థన కనిపిస్తుంది. ప్రియురాలిలో విరహాగ్ని రగులుకొని ఉంది. ఇక దానిని పెంచాలి. అప్పుడే కలయిక. అందువల్ల ప్రియురాలికి విరహాగ్నిని  పెంపుజేయవే...అనిపించడం అతనితో.

నాయికా నాయకుల మధ్య ప్రేమ భావన ఉదయించడం, దాని ఫలితమైన విరహాన్ని వర్ణించడం - తద్వారా కథలో ఓ కీలకమయిన మలుపుకు దోహదం చేసేలా ఆ సన్నివేశాన్ని రూపొందించడానికి ఒక పాటను అద్భుతంగా రచించారు పింగళి.

భాషలోని తీపిని తెల్లపరిచేలాంటి తేలిక పదాలతో గంభీరమైన భావాన్ని పెంచి పోషించారు.
ఎంతఘాటు ప్రేమయో అన్న పదబంధం సృష్టించి కొన్ని తరాలపాటు దానిని తెలుగు హృదయాలలో నిలిపిన ఖ్యాతి పింగళివారిదే. తెలుగు భాష పదజాలంలో పింగళి వారు చేర్చిన ఎన్నో పలుకుబడులలో ఇది ఎంతో ముఖ్యమయినది కూడా.


పాటకి సంబంధించిన సాహిత్యం :

ఆమె     ఎంత ఘాటు ప్రేమయో
           ఎంత తీవ్ర వీక్షణమో............ఎంత ఘాటు ప్రేమయో
           కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే
           నా మనసు మురిసెనే.....
  అతను  ఎంత లేత వలపులో
            ఎంత చాటు మోహములో
             కన్నులలో కనినంతనె
            నా మనసు మురిసెనే
ఆమె      ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
             విరహములో వివరాలను విప్పిచెప్పెనే      ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేత వయసులో
అతను    ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయా నిలమా
            ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే       ఎంత లేత వలపులో...ఎంత చాటు మోహములో. 
      
అద్భుతమైన సాహిత్యానికి అత్యంత మధురంగా బాణీకట్టిన ఘంటసాలగారు  పి.లీలగారితో కలిసి భావయుక్తంగా పాడి  ఈ పాటని చిరంజీవిని చేసారు.

ఈ పాటని దృశ్యరూపంలో చూడాలంటే ఇక్కడ చూడండి.






Wednesday, May 25, 2011

Tuesday, May 24, 2011

కరుణ రసాత్మకమైన వియోగ గీతం

మల్లీశ్వరి - 1951.
ఘంటసాలగారు భానుమతిగారితో కలిసి ఆలపించిన మధురమైన గీతాలలో ఇది మరువలేనిది.
అరవైసంవత్సరాల క్రితం ఆ పాట జనహృదయాలను ఎలాంటి భావోద్వేగాలకు గురిచేసిందో నేడు కూడా అంతగానే మనసులను ఆకట్టుకుంటుంది. చక్కని సాహిత్యానికి మధురమైన సంగీతం తోడైతే  పాటకు ఒనగూరే వైభవం అది.

అద్భుత దృశ్యకావ్యం మల్లీశ్వరి చిత్రం. 


నాయికానాయకులు  బావామరదళ్ళు,  ప్రేమికులు కూడా. అనుకోకుండా విడిపోయారు. తిరిగి కలుసుకునే ఘడియ  ఉందో లేదో తెలియదు. ప్రత్యక్షంగా  తన ప్రేమను తెలుపుకునే అవకాశమూ లేదు.  తెలుగు సినిమాపాటను మేరుశిఖరాగ్ర స్ధాయికి చేర్చిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కలంనుంచి ఇలాంటి సందర్భంలో పుట్టిన పాట.

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు ........


ఈ గీతానికిమహాకవి కాళిదాసు మేఘసందేశం కావ్యం లో మేఘం దూతగా ఉండే అంశమే స్ఫూర్తి అన్న విషయం అందరికీ తెలిసినదే.
యక్షుడు దూరతీరాలలో ఉన్న ప్రేయసికి తన క్షేమాన్ని, ఆమెపైగల తన ప్రేమను తెలియజేయడానికి సందేశం తెలుపడానికి  ఆకాశంలో తారాడే మేఘాన్ని అడగడం మేఘసందేశం కావ్యవస్తువు.అయితే ఈ కావ్యం మేఘం ప్రయాణించే దారిలో కనిపించే వింతలూ, విశేషాలు వర్ణిస్తూ సాగిపోతుంది.


ఈ గేయంలో కృష్ణశాస్త్రిగారు మేఘాన్ని దూతగా ప్రయోగిస్తూనే నాయికా నాయకుల ఇరువురి విరహ భావాన్నీ, విషాద భరితమైన భావోద్వేగాన్ని అత్యంత కరుణరసాత్మకంగా రచించారు.
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవు

బావ క్షేమంకోసం ఆరాటపడుతూ, ఆ వివరాలు తెలుసుకొని రమ్మని మేఘాన్ని అడుగుతుంది మరదలు మల్లి. ఆకాశవీధిలో హాయిగా ఎగురుతూ, దేశ దేశాలు తిరుగుతూ, స్వేచ్ఛగా విహరించే మేఘమే తనకు కావలసిన వివరాలు చెప్పగలిగేదని భావిస్తుంది. 


ఏడతానున్నాడొ బావా
జాడతెలిసిన పోయి రావా  - అందాల ఓ మేఘ మాల


అంటూ మేఘమాల అందాన్ని కొంచెం పొగుడుతూ  తన బావ జాడని తెలుసుకొని ఆ కబురు చెప్పమంటూ బతిమాలుతుంది.


గగన సీమల తేలు ఓ మేఘమాలా
మా వూరు గుడి పైన మసలి వస్తున్నావా..
మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా
రాగాల ఓ మేఘ మాలా....
ఇక్కడ మల్లి తన బావకోసం ఆరాటపడుతూ ఉంటే,  ఉపాధి కోసం దేశాంతరాలు వచ్చిన తన గురించి మల్లి తల్లడిల్లుతోందని ఆ బావ మనసుకి తెలుస్తుంది. మల్లి ఎలా ఉందో అడగాలంటే అతనికి కూడా ఆ ఆకాశంలో విహరించే మేఘమే సరైనదని అనిపిస్తుంది. 


తను చూస్తున్న ఈ మేఘం తన మల్లి ఉండే ఊరి గుడిపైన తిరిగి వస్తోంది అని భావించి,  తప్పక మల్లి దగ్గరనుండి ఏదో సందేశాన్ని మోసుకొని వచ్చే ఉంటుందని భావిస్తాడు. ఆ మాటేదో చెప్పి బాధతో రగులుతున్నమనసుకు  చల్లగా ఓ మాటచెప్పమని మేఘాన్ని వేడుకుంటాడు.


మమత తెలిసిన మేఘమాల
నా మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కనులు దిగులుతో రేపవలు
ఎదురుతెన్నులు చూచెనే
బావకై  చెదరి కాయలు కాచెనే ....
ఓ రాగాల ఓ మేఘమాల.

మల్లి కి బావధ్యానంలో కళ్ళుమూతలు పడడం లేదు. బావకోసం రేయిపగలు  ఎదురుచూపులో కళ్ళు కాయలు కాసిపోయాయి. ఈ విషయం బావతో చెప్పు అంటుంది. 


మనసు తెలిసిన మేఘమాల
మరువ లేనని చెప్పలేవా
మల్లితో....మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచిన  గాని కళ్ళు  మూసిన గాని 
మల్లి రూపే నిలిచెనే.....నా చెంత మల్లి మాటే  పిలిచెనే


ఇక్కడ బావ కూడా మల్లిని మరిచిపోలేకపోతున్నానని, కళ్ళు తెరిచినా మూసినా మల్లే కనిపిస్తోందని, పక్కనే మల్లి నిలిచి పిలుస్తున్నట్టుగా ఉందని తన ఆవేదనను  ఆ మేఘానికి చెప్పుకుంటాడు. 
ఆకాశంలో పయనించే నీలి మేఘం కారు మేఘంగా మారిపోయింది. ఇక ఘడియో క్షణమో అన్నట్టుగా కురవడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రకృతి సహజంగా జరిగేదే. కానీ మేఘం నీలిరంగులోంచి కారుమేఘంగా మారి కురవడానికి సిద్ధంగా మారడాన్ని మల్లి గుండెలోని దుఃఖానికి ఆపాదించడం కవి ప్రత్యేకత. మేఘం తనపట్ల జాలి చూపించాలని మల్లి కోరిక. అందుకే ఆ  అందాల మేఘమాల ఇప్పుడు జాలిగుండె కూడా కలదిగా కనిపిస్తోంది మల్లికి.


జాలిగుండెల మేఘమాలా
బావలేనిది బ్రతుక జాల
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసి పోవా
కన్నీరు .....ఆనవాలుగ బావ మ్రోల


మల్లికి  గుండె బరువుగా అయింది. తనగుండె బరువు తీరాలంటే బావదగ్గర తన దుఃఖాన్ని కన్నీరుగా కరిగించుకోవాలి. అందుకు తనకు అవకాశంలేదు కనుక తిరిగి మేఘాన్నే ఆ పని చేయమని అడుగుతుంది. జాలిగుండెల మేఘమాల అని తన పై జాలిచూపించి, తన కన్నుల కురిసే నీటిని గుండెల్లో దాచుకుని ఆ నీరంతటినీ మోసుకుపోయి బావ సన్నిధిలో కురిపించమని ఆ మేఘాన్ని అభ్యర్థిస్తుంది.మల్లి తనకై ఎంతగా బాధ పడుతోందో తెలుసుకోవడానికి బావకి ఆ మేఘం కురిపించే వాన ఆనవాలు కాగలదని భావిస్తుంది.

కరుణరసానికి పరాకాష్ఠ ఈపాట.
వియోగ శృంగారం ఎంత కరుణరస ప్లావితంగా ఉంటుందో అద్భుతంగా వర్ణించబడిన గీతం ఇది.


ఈ పాట పూర్తి సాహిత్యం ఇది.

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు

దేశ దేశాలన్ని తిరిగి చూసేవు

ఏడ తానున్నాడో బావ

జాడ తెలిసిన పోయిరావా!

గగనసీమల సాగు  ఓ మేఘమాల

మా ఊరు గుడి పైని మసలి వస్తున్నావా!

మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా

నీలాల ఓ మేఘమాల! రాగాల ఓ మేఘమాల!



మమత తెలిసిన మేఘమాల!

నా మనసు బావకు చెప్పి రావా!

ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు

ఎదురుతెన్నులు చూచెనే బావకై

చెదిరి కాయలు కాచెనే  అందాల ఓ మేఘమాల


మనసు తెలిసిన మేఘమాల!

మరువలేనని చెప్పలేవా!

మల్లితో మరువలేనని చెప్పలేవా!

కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని

మల్లి రూపే నిలిచెనే

నా చెంత మల్లి మాటే పిలిచెనే!


జాలి గుండెల మేఘమాల!

నా బావ లేనిది బ్రతుకజాల!

కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని

వానజల్లుగ కురిసిపోవా కన్నీరు

ఆనవాలుగా బావమ్రోల.

చిత్రం: మల్లీశ్వరి(1951)
గీత రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గాయనీగాయకులు: ఘంటసాల వేంకటేశ్వరరావు, శ్రీమతి పి.భానుమతి
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు


స్వరరాజు ఎస్.రాజేశ్వరరావుగారు పాడి వినిపించిన అరుదైన గీతం ఇక్కడ వినండి. ఈ చిత్రం గురించి, ఆకాశవీధిలో పాట గురించి ఆయన మాటల్లో వినండి.
























తెలుగు సినిమాల్లో యుగళ గీతాలు

యుగళం అంటే రెండు గళాలు. ఇద్దరు వ్యక్తులు  పాడిన ఏపాటైనా "యుగళ గీతమే".
ప్రస్తుతం మాత్రం ఈ యుగళగీతం అనే మాటకి చలనచిత్రాలలో నాయికా నాయకులు తమ ప్రణయ భావాలను ఒకరికొకరు తెలుపుకోవడానికి గేయరూపంలో పాడుకునే పాట అనే అర్థంతో బహుళ ప్రచారంలో ఉంది. వీటినే "డ్యూయెట్" అనే పేరుతో కూడా పిలుచుకుంటున్నాం.

తెలుగు లో చలనచిత్రాల నిర్మాణం 1935 ప్రాంతాలలో ప్రారంభం అయి మూకీల నుంటి టాకీలయుగానికి మారి అనేక సాంకేతికమార్పులు పొందింది. నాయికానాయకులు పాటలు పాడుతూ తమ ప్రేమను వెల్లడించుకోవడం టాకీలయుగం నుంచి కనిపిస్తుంది. మొదట్లో సినిమాలలో పాత్రలు పాటలు పాడవలసిన సందర్భంలో ఆయా నాయికా నాయకులుగా ఉన్న పాత్రధారులే స్వయంగా ఆ పాటలు పాడేవారు. అందువల్ల రూపం తో పాటు సుస్వరమైన గానం కూడా పాత్రధారులకు తప్పని సరి అయింది.  తర్వాత నేపథ్యగానం అనే విధానం వల్ల అనేక మార్పులు వచ్చి తెరవెనుక నేపధ్యంలో వచ్చే గానానికి అనుగుణంగా తెరమీద   పాత్రధారుల అభినయం ప్రారంభమైంది.
సుమారు 1950 ప్రాంతాల నాటికి ఘంటసాల వెంకటేశ్వరరావుగారు చిత్రసీమలో ప్రవేశించేనాటికి నేపథ్యసంగీతం బాగా నాటుకుంటూ ఉంది. అప్పటివరకు తమ పాత్రలకు తామే పాట పాడుకున్న అగ్రహీరోలు నాగయ్య వంటి వారు నాయక పాత్రల నుండి కారెక్టర్ నటులుగా మారవలసిన వయసుకు వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు తమ నటనా వైదుష్యంతో  అగ్రస్ధానానికి చేరుకున్నారు.


ఆది నారాయణరావు, సాలూరు రాజేశ్వరరావు, మాష్టర్ వేణు, పెండ్యాల నాగేశ్వరరావు వంటి సంగీత దర్శకులు, మల్లాది వెంకటకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సముద్రాల సీనియర్, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర  ఇలా ఎందరో మహానుభావులు తమ సంగీత సాహిత్యాలను మేళవిస్తే  రావు బాల సరస్వతి, ఘంటసాల వెంకటేశ్వరరావు, భానుమతి, ఎస్.వరలక్ష్మి, పి.లీల, సుశీల, జి.కృష్ణవేణి(జిక్కి) వంటి వారు తమ గానంతో వాటిని అమృతమయం చేసారు. 
1950 కిముందు చలనచిత్రాలలో యుగళగీతాలు ఉన్నా అప్పటికి   సాంకేతికపరిజ్ఞానం తక్కువగా ఉండడంవలననేమో వాటిని వినాలనే ఆసక్తి  చూపించేవారు తక్కువే.


ప్రస్తుతం "పాత పాటలు చాలా బావుంటాయి, మనసుని రంజింపచేస్తాయి" - అని పరవశంతో పదే పదే వింటున్న పాటలన్నీ 50 ల తర్వాత వచ్చినవే అనిపిస్తుంది.
తెలుగుచలనచిత్ర సంగీతం లో ఘంటసాల వెంటేశ్వరరావుగారు మకుటం లేని మహారాజు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు అగ్రశ్రేణి హీరోలుగా వెలిగిపోవడంలో ఘంటసాల పాత్ర ఎంతో ఉంది. 


పి.బి.శ్రీనివాస్, ఎ.ఎమ్.రాజా కూడా ఆనాటి నేపథ్యగాయకులలో పేరుపొందినవారే. కానీ ఘంటసాల వీరిద్దరికీ పాడినన్ని పాటలు మరి ఎవరికీ పాడలేదేమో. కేవలం నేపథ్యగానమే కాక అలనాటి మేటి సంగీతదర్శకుల తో సమానమైన స్థానంలో నిలబడి తన సంగీతంతో తెలుగు ప్రజలకు అత్యంత ఆత్మీయుడై ఆత్మబంధువుగా నిలిచారు ఘంటసాల.
ఘంటసాల వెంకటేశ్వరరావుగారు ఎక్కువగా యుగళగీతాలు పాడినది సుశీలగారితోనే. ప్రారంభంలో రావు బాలసరస్వతి,  పి.లీల, జిక్కి లతోను, కొన్ని పి.భానుమతిగారితోను, మరికొన్ని ఎస్.జానకిగారితోను  పాడినా సింహభాగం సుశీలతో పాడినవే.


1950ల నుండి వచ్చిన చలనచిత్రాలలోని యుగళగీతాలను సేకరించి వాటి సాహిత్యాన్ని వీలైతే వీడియోలను జతచేస్తూ ఈ బ్లాగులో ఉంచాలన్నది ఉద్దేశం.
వాటిలో చాలా యుగళగీతాలు సంగీత పరంగానే కాక సాహిత్యంతో కూడా శ్రోతల మనసులు దోచుకున్నాయి.
ఆ  సాహిత్యంలో ఉన్న చక్కదనాన్ని అందరితోను పంచుకోవడానికి ఈ బ్లాగు.